గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, నవంబర్ 10, 2015

దత్తపద్యారంభము: ఎందుల కిన్ని బాధల సహింతువు...(నచ్చిన అంశముపై పద్యరచన)

*****************************************************************************
తేది: సెప్టెంబర్ 11, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన పద్య ప్రారంభము "ఎందుల కిన్ని బాధల సహింతువు..." అను వాక్యమునకు కొనసాగింపుగా నేను పూరించిన పద్యము...



******************************************************************************

(సత్యవంతుని ప్రాణములఁ గొనిపోవుచుండఁగాఁ దన్ను వెంబడించిన సావిత్రితో యముఁడు పలికిన మాటలు)


******************************************************************************

ఉత్పలమాలిక:
"ఎందుల కిన్ని బాధల సహింతువు? మద్రసుతా! యముండ నే!
నిందునిభాస్య! నీ మగని నిట్టుల నేఁ గొనిపోవ, నీ విటుల్
సందడిఁ జేయుచున్ వెత వసమ్మున వెంటఁ బడంగ రాదు! కొ,
మ్మింద, వరమ్ము నిత్తు, నిఁక, నీశుని ప్రాణముఁ దక్కఁ గోరి, యే
కొందలపాటు లేక యిఁకఁ గూర్చుమ నాకుఁ బ్రమోద మి" ప్డనన్,
ముందుగఁ గోరె స్వశ్వశురు పూర్వపు వైర్యపహార్య రాజ్యమున్,
సందియ మింక లేక వరుసన్ గనె మామను లబ్ధచక్షుగన్!
గుందుచు వెన్కఁ బోవ, హరి గొబ్బున నింకొక కోర్కెఁ దీర్పఁ, దం
డ్రిం దగఁ బుత్ర సచ్ఛతునినింగ నొనర్పఁగ, నట్లె రాఁగఁ దాఁ
జిందులు ద్రొక్కుచున్ "ముదిత! శ్రేష్ఠతమాంచిత సద్వరమ్మునున్
బొందియు వత్తువేల? యిఁకఁ బోఁగదె!" యంచు ననంగ, నామెయున్
"ముందుగ రెండు కోర్కెలిడి ముద్దునుఁ గూర్చితి విప్డు! నీ విఁకన్
వందన మంది, మూఁడవది వద్దనకుండ మహాత్మ, యీయు!" మం
చుం దన కోర్కి నీయుమన, సూర్యజుఁ డప్పుడు "సాధ్వి! నేఁడు నా
డెందము సంతసించె! నిదె డిగ్గన నిచ్చెద! నాథు ప్రాణముల్
వొందఁగఁ గోరఁబోక మఱి వొందుమ వేఱొక కోర్కి" నన్న నా
ముందఱ భర్తఁ గాంచియు, యమున్ దగఁ గోరెను "దండపాణి! నా
కుం దగు తోడుఁ గొంటి! మది కుందె! సుపుత్రుని నా కొసంగియున్
విందునుఁ గూర్చుమయ్య!" యన, వెంటనె దండి "తథాఽ"స్తనంగ, నా
నందముతోడ, "సౌరి! యెటు నందెద సంతతి? మానవాంగనల్
వొందెద రెట్లు సంతతిని వోఢను వీడియు లోకమం?"దనన్,
దొందరపాటుఁ గన్గొనియు దున్నవయాళికుఁ డంత "సాధ్వి! నీ
సుందర సూక్ష్మ వాక్ప్రతతిఁ జూడ మహాద్భుతమయ్యె! సంతసం
బందితిఁ! బుత్రపౌత్రయుతవై సుఖియింపుము భర్తతోడ! నే
నుం దగఁ బోయి నా విధులనుం దగఁ దీర్తు! శుభమ్ము నీ విలన్
బొందు!"మటంచు దీవెనలు పొందుగ నిచ్చి యగోచరుండయెన్!
జెందొవ చూపు లందముగఁ జిత్రపు నాట్యములాడఁ దాను స్వా
మిం దమితోడఁ జూచుచు గమించిన తత్కథనంత భర్తకున్
సుందరమైన రీతి వినసొంపగునట్లు వచించె! నిర్వురున్
మందగమమ్ములేక కర మందిరి భోగము పూర్వ రీతిగన్!!

******************************************************************
-:శుభం భూయాత్:-
******************************************************************



మంగళవారం, నవంబర్ 03, 2015

ఆంధ్రా కుట్రలతో... ఒడువని విభజన... 231 సంస్థల్లో ఇంకా సిగపట్లే...!!!

andra


రాష్ట్ర విభజన జరిగి 16 నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వరంగ సంస్థల విభజన ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. విభజన కోసం వేసిన కమిటీలు చేతులెత్తేశాయి. కేంద్రం పట్టించుకోవటం లేదు. ఒక అంచనా ప్రకారం.. పునర్విభజన చట్టం మేరకు విభజన పూర్తయితే తెలంగాణకు 50 వేల కోట్ల ఆస్తులు దక్కుతాయి. అపుడు తెలంగాణ గుజరాత్‌ను మించిన సంపన్న రాష్ట్రమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థలన్నింటినీ విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లో పొందుపరిచారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో 68 నుండి 71 వరకు ఉన్న సెక్షన్లలో 9వ షెడ్యూల్‌లో 89 సంస్థల విభజన గురించి, సెక్షన్-75లో పదో షెడ్యూల్‌లో 142 సంస్థల పంపిణీ గురించి వివరించింది. 


-విభజన జరిగినా ఆస్తుల్లో పంచాయితీ
-తెలంగాణకు వచ్చే వాటా 50 వేల కోట్లు..
-సంపదలో గుజరాత్‌ను మించనున్న రాష్ట్రం
అయితే ఈ బిల్లులో 35 సంస్థల విభజనను చేర్చకపోవటాన్ని గమనించి టీజేఏసీ, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆందోళన చేయటంతో కేంద్ర ప్రభు త్వం మే7, 2015న ఈ సంస్థల విభజనను కూడా పదో షెడ్యూల్‌లోకి చేరుస్తూ గెజిట్ పబ్లిష్ చేసింది. అయితే ఇంతవరకూ వీటిని విభజించే యంత్రాంగం లేదు. అంతేకాదు మొత్తం 231 సంస్థలలో విభజనపై కదలిక లేని పరిస్థితి ఏర్పడింది. తొమ్మిదోషెడ్యూల్ సంస్థల్లో ఆస్తులు, ఉద్యోగుల పంపిణీకోసం నియమించిన షీలాభిడే కమిటీ ఆగస్టు- 2015వరకు నాన్చినాన్చి ఎటూతేల్చకుండా వదిలేసింది. పదో షెడ్యూల్ సంస్థల విభజనకు ఏపీ అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంది.


ఏపీ అడ్డంకులు:


ఏపీ హార్టీకల్చర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, స్టేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, మానవహక్కులసంఘం, ఆర్‌టీఐ, ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్, ఏపీ స్టేట్‌వక్ఫ్‌బోర్డు ట్రిబ్యునల్, లోకాయుక్త, స్టేట్‌కన్సూమర్ రిడ్రెస్సెల్ కమిషన్, జ్యుడీషియల్ అకాడమీ, విజిలెన్స్ కమిషన్, ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్‌కోర్టు, గవర్నమెంట్ ప్రింటింగ్‌ప్రెస్, నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్, ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వంటి ముప్పైనాలుగు సంస్థల విభజనలకు ఏపీ పాలకులు అడ్డంపడుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, లోకాయుక్త వంటి సంస్థలలోని తెలంగాణ ఉద్యోగులు శాఖాధిపతులపైన విభజనకోసం ఒత్తిడి పెంచుతున్నా సీమాంధ్ర అధికారులు సహాయ నిరాకరణ చేస్తుండగా ఏపీ సర్కార్ ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నది. 


59 సంస్థల్లో ఆస్తుల పంచాయితీ..:


తొమ్మిదో షెడ్యూల్‌లో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల సమ్మతితో 59 సంస్థల విభజనైతే జరిగిందిగానీ.. ఆ సంస్థలలో ఆస్తుల పంపిణీ జరగకుండా సీమాంధ్ర అధికారులు ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. పౌరసరఫరాల విభాగం పరిధిలోని కార్పొరేషన్‌లో ఏ రాష్ర్టానికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ర్టానికి అనే అంశం మీద ఇరు రాష్ర్టాల ఉద్యోగ సంఘాల నాయకులు అంగీకారానికి వచ్చారు. అయితే అక్కడ పనిచేసే శాఖాధిపతి గోపాల్ ఉద్యోగుల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆయనకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వత్తాసు ఇవ్వడమే కాకుండా సెలెక్ట్‌కమిటీల పేరుతో జాప్యం జరిగేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఫలితంగా పదో షెడ్యూల్‌లోని 142 సంస్థలలో విభజన ప్రక్రియ నిలిచిపోయింది. 


సహకరించుకుంటే చిటికెలోపని:


తొమ్మిది, పది షెడ్యూల్ సంస్థల విభజన అంశంలో ఇరు రాష్ర్టాల శాఖాధిపతులు అవగాహన కుదుర్చుకున్నా సరిపోతుందని పునర్వ్యవస్థీకరణ చట్టం చెప్తున్నా ఏపీ శాఖాధిపతులతో ఆ రాష్ట్ర సర్కారు కొర్రీలు పెడుతూ వస్తున్నది. విద్యుత్‌శాఖలో విభజన జరుగకుండా హైకోర్టులో లిటిగేషన్లు సృష్టించారు. షీలాభిడేకమిటీకి సమాచారం అందించకుండా కాలయాపన చేశారు. ఛత్తీస్‌గఢ్-మధ్యప్రదేశ్ స్వతంత్రసంస్థలు, శిక్షణా సంస్థల విభజనను ఏడాదికాలంలో పూర్తి చేసుకున్నాయి. అక్కడ ఇరు రాష్ర్టాల మధ్య సదవగాహన ఉండటమే అందుకు కారణం. ఎన్ని మార్గదర్శకాలు ఉన్నా, చట్టాలు చేసినా ప్రాథమికంగా ఇరు రాష్ర్టాల మధ్య అవగాహనే అన్నింటికన్నా ముఖ్యం. దానికి భిన్నంగా ఏపీ వైఖరి ఉండటం వల్లనే అన్ని సమస్యలు వస్తున్నాయి.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!